. . . గ్రామస్థాయి వరకు ఆర్థిక అవగాహన విస్తరణే లక్ష్యం
. . . అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు నిర్వహించనున్న ఫైనాన్షియల్ లిటరసీ వీక్–2026 కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కేవైసీ – సురక్షితమైన బ్యాంకింగ్ వైపు మీ మొదటి అడుగు” అనే అంశంపై ఈ ఏడాది ఫైనాన్షియల్ లిటరసీ వీక్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో కేవైసీ నిబంధనలపై అవగాహన పెంపొందించడం, సీకేవైసీ ప్రాముఖ్యత, ఖాతా భద్రత, కేవైసీ కు సంబంధించిన మోసాల నివారణ, మనీ మ్యూలింగ్ వంటి అంశాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆర్థిక అవగాహన మరింత విస్తృతంగా చేరేలా గ్రామ సభలు, అవగాహన శిబిరాలు, సమావేశాల ద్వారా బ్యాంకులు, సంబంధిత శాఖలు సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ఆర్ఎల్ఎం పరిధిలోని స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు ద్వారా విస్తృత స్థాయిలో ప్రజలను చైతన్యవంతులను చేయాలని తెలిపారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా పట్టణ స్వయం సహాయక సంఘాలు, వార్డు స్థాయి సంఘాల సమావేశాల ద్వారా ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.
