. . . ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహణ
కామారెడ్డి, బతుకమ్మ :
దేశ సమగ్రత, శాంతి, అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు. భారత రత్న, మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి దూరదృష్టితో పనిచేసిన నాయకుడని కొనియాడారు. యువతకు సాంకేతిక విప్లవాన్ని అందించిన మహానేతగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజీవ్ గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ సేవలను స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పార్టీ శ్రేణులు ఉగ్రవాద వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరని సందీప్, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

