. . . బొగ్గు గుడిసె వద్ద వరదలో చిక్కుకున్న 8 మంది కూలీలు
బాన్సువాడ, బతుకమ్మ :
భారీ వర్షాల కారణంగా జుక్కల్ నియోజకవర్గం అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా బుధవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి పారుతున్నాయి. కళ్యాణి ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది.
మంజీర పరవళ్లు..
మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది.. ఎగువ నుంచి విపరీతంగా వస్తున్న వరదల కారణంగా నిజాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్లు వదిలి 1,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి.
35 ఏళ్లలో మొదటిసారి..
నిజాంసాగర్ మండల కేంద్రంలోని చిన్నాపూర్ వంతెనను ఆనుకొని వరద ప్రవహిస్తోంది. గత 35 ఏళ్లలో ఇలా వంతెనను తాకుతూ వరద పారడాన్ని మొదటిసారి చుస్తున్నామని ప్రజలు పేర్కొంటున్నారు.

నిజాంసాగర్ గ్రామం లో వరద..
నిజాంసాగర్, సుల్తాన్పూర్ గ్రామంలో భారీగా వరద వచ్చి చేరింది. ఎగువన లింగంపేటలో చెరువులు తెగిపోవడంతో భారీ వరద ఈ రెండు గ్రామాలను చుట్టుముట్టింది. మునుపెన్నడూ లేని విధంగా నిజాంసాగర్ మండలం లో బొగ్గు గుడిసె పూర్తిగా నీటమునిగింది. లింగంపేట లో చెరువులు కొట్టుకుపోగా వరద అంతా కళ్యాణి ప్రాజెక్టులోకి వస్తుంది. దీంతో ప్రజలంతా ముందస్తుగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.
నీటిలో చిక్కుకున్న బిహారీ కూలీలు..
బొగ్గు గుడిసె సమీపంలో జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. అయితే వరద ఒక్కసారిగా ముంచెత్తడంతో పనుల్లో భాగంగా అక్కడ ఉన్న 8మంది బిహారీ కూలీలు వరదలో చిక్కుకున్నాయి. అక్కడ ఉన్న వాటర్ట్యాంక్ పైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే గున్కుల్ గ్రామంలో కోళ్ల ఫారం లో ఉంటున్న ముగ్గురు వ్యక్తులు వరదలో చిక్కుకున్నారు. ముగ్గురిలో ఒక బాలుడు ఉన్నట్లు సమాచారం.
రంగంలోకి దిగిన ఎస్ డిఆర్ ఎప్ సిబ్బంది..
బొగ్గు గుడిసె వద్ద వరదలో చిక్కుకున్న కూలీల కోసం ఎస్డీఆర్ఎప్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మొదట హెలీక్యాప్టర్ సాయంతో కూలీలను కాపాడాలని సూచించినట్లు తెలిసింది. అయితే ముందుగా, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి,ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు…

