. . . ఉదయం నుంచే తల్లిదండ్రులతో పాటు బారులు
. . . ఈ – కెవైసీ కోసం పిల్లలతో ఆధార్ సెంటర్ లకు పరుగులు
భిక్కనూరు, బతుకమ్మ :
భిక్కనూరు మండల కేంద్రంలోని ఆధార్ సెంటర్ వద్ద రేషన్ కార్డులకు ఈ – కెవైసీ తప్పనిసరి చేయడంతో ఆధార్ సెంటర్ల వద్ద పిల్లలతో కలిసి మంగళవారం తల్లిదండ్రులు ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. ప్రభుత్వం డెడ్లైన్ విధించడంతో రేషన్ కార్డు రద్దు అవుతుందనే భయంతో జనం ఆధార్ సెంటర్లకు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలతో వచ్చిన వారి సంఖ్య అధికంగా ఉంది. సెంటర్ వద్ద కూర్చోవడానికి సౌకర్యాలు, తాగునీరు లేకపోవడంతో పిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకే కంప్యూటర్ పై పని జరగడం, సిబ్బంది కొరతతో రోజుకు కొద్దిమందికి మాత్రమే ఈ – కెవైసీ అవుతోంది. దీంతో ఉదయం 6 గంటల నుంచే లైన్లలో నిలబడాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు వెంటనే అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి, పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ ను పొడిగించాలని భిక్కనూరు మండల ప్రజలు కోరుకుంటున్నారు.
