నిజామాబాద్, బతుకమ్మ :నిజామాబాద్ నగరంలో రిజిస్ట్రేషన్లకు సబ్ రిజిస్ట్రార్లు కొర్రీలు పెడుతున్నారని డాక్యుమెంట్ రైటర్లు, రియాల్టర్లు మండిపడ్డారు. గతంలో పని చేసిన సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేసిన వాటికి రెండవ డాక్యుమెంట్లపై రిజిస్ట్రేషన్ చేయడం లేదని అదే విధంగా పాత ఇళ్ళకు రిజిస్ట్రేషన్లు జరుగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో కొత్తగా వచ్చిన సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లకు మోకాళ్ళు అడ్డుతున్నారని డాక్యుమెంట్ రైటర్లు, రియాల్టర్లు సోమవారం నిరసనకు దిగారు. నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఇది వరకే రిజిస్ట్రేషన్లను పునరుద్దరించకపోతే నిరసన తెలుపుతామని ప్రకటించిన డాక్యుమెంట్ రైటర్లు ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీకి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఆయన స్వయంగా రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రమేష్ రెడ్డికి ఫోన్ చేసి సమస్యలు పరిష్కరించాలని కోరారు. దానికి ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. కానీ సోమవారం రిజిస్ట్రేషన్లు విషయంలో సబ్ రిజిస్ట్రార్లు సహకరించకపోవడంతో వారు నిరసనకు దిగారు.
