- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
కామారెడ్డి, బతుకమ్మ : స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపడితే సహించేది లేదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పార్టీ కోసం పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని సూచించారు. కష్టపడి పని చేసే వారికి పదవులు వస్తాయని, ఎవరైనా పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజా పాలనలో ప్రజలకు న్యాయం జరుగుతుందని, జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. అంతేకాకుండా విద్య, వైద్యం, ఉపాధి కల్పించే బాధ్యత తనదే అని తెలియజేశారు. ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా స్వయంగా తన దృష్టికి తీసుకురావాలని, ఇందిరమ్మ ఇండ్లను, రేషన్ కార్డులో పారదర్శకంగా నిరుపేదలైన అర్హులకు మాత్రమే ఇస్తామని తెలియజేశారు. అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ నగర్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఏలే మల్లికార్జున్, లోక్య నాయక్, నాగభూషణం గౌడ్,గంగి రమేష్, మల్లయ్య గారి ఆకాష్, గొట్టం నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

