. . . నేలకు అతి దగ్గరగా వేలాడుతున్న లైన్లతో ప్రాణభయం
. . . ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని రైతుల విజ్ఞప్తి
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో వ్యవసాయ పొలాల మధ్యుగా వెళ్లే విద్యుత్ లైన్లు ప్రస్తుతం రైతులు, కూలీలు, పశువులకు ప్రాణహానిగా మారాయి. సాధారణ ఎత్తులో ఉండాల్సిన విద్యుత్ తీగలు కేవలం నాలుగు నుంచి ఐదు అడుగుల ఎత్తులోనే వేలాడుతుండటంతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పలు వ్యవసాయ భూముల మీదుగా వెళ్లే విద్యుత్ తీగలు కిందికి వంగిపోవడంతో అవి మనుషుల ఎత్తుకు సమీపంగా మారాయని రైతులు చెబుతున్నారు. దీంతో ప్రతిరోజూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పొలాల్లో పనులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు, వ్యవసాయ కూలీలతో పాటు పశువులను మేపడానికి వెళ్లే గ్రామస్తులు కూడా తీవ్ర భయాందోళనల మధ్య జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా గేదెలు, మేకలు, ఎద్దులు వంటి పశువులు విద్యుత్ తీగలకు సమీపంలోకి వెళ్లే పరిస్థితి ఉండటంతో ఎప్పుడు ప్రమాదం సంభవిస్తుందోననే ఆందోళన గ్రామంలో నెలకొంది. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సమస్య మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. వర్షాల సమయంలో తీగలు మరింత కిందికి వంగే ప్రమాదం ఉండటంతో పాటు, తడి నేల కారణంగా విద్యుత్ ప్రసరణ పెరిగి మనుషులు, పశువులు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు అధికమని పేర్కొంటున్నారు. ఇప్పటికే పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు సమస్యను తెలియజేసినా శాశ్వత పరిష్కారం చూపలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు గ్రామానికి వచ్చి పరిస్థితిని పరిశీలించినప్పటికీ తీగలను సరిచేయడం, స్తంభాలను బలపరచడం వంటి చర్యలు చేపట్టలేదని గ్రామ ప్రజలు విమర్శిస్తున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు ఎక్కువ సమయం పొలాల్లో గడుపుతున్నారని, ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు, గడ్డి మోసే వాహనాలు తీసుకెళ్లే సమయంలో కూడా ఈ విద్యుత్ తీగలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు. ఎత్తయిన వ్యవసాయ యంత్రాలు తీగలకు తగిలే ప్రమాదం ఉండటంతో ప్రతి పనిని భయాందోళనల మధ్య నిర్వహించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. గ్రామస్తులు కూడా విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగాక స్పందించడం కాకుండా, ప్రమాదం జరగక ముందే నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. భూంపల్లి గ్రామంలోని విద్యుత్ తీగలను వెంటనే సరైన ఎత్తుకు ఎత్తడంతో పాటు, అవసరమైతే కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని, పాడైన తీగలను మార్చాలని, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గ్రామ ప్రజల ప్రాణభద్రతను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

