బాన్సువాడ, బతుకమ్మ :
హైదరాబాద్లో సీఎం ఇంటిముట్టడి కార్యక్రమానికి మలిదశ ఉద్యమకారులు శుక్రవారం పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బాన్సువాడ పట్టణంలో పోలీసులు ముందస్తుగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను ఆదుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి మూడేళ్లు గడిచినా ఇప్పటివరకు తమ ఆశయాలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఎం ఇల్లు ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను జూన్ 2లోపు అమలు చేయాలని, లేనిపక్షంలో తదుపరి కార్యాచరణ మరింత తీవ్రంగా ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉడుత గంగాధర్ గుప్తా, మండల అధ్యక్షుడు గంజివార్ చందు, కాల్వ శ్యామ్, భాస్కర్ గౌడ్, ఎదుబాల్లే కృష్ణ, అగ్లవే దత్తు, గైని గంగారామ్, పల్లికొండ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
