బాన్సువాడ, బతుకమ్మ :
ఆషాఢ మాసం సందర్భంగా బాన్సువాడ పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించిన బోనాల పండుగ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలోని కోటగల్లి కోటదుర్గమ్మ ఆలయం, సాయికృప నగర్ ఫేజ్ – 2 కాలనీలోని మైసమ్మ ఆలయం, రుద్రూర్ గ్రామంలోని పోచమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాల్లో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కూడా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, సుభిక్షాలతో ఉండాలని ప్రార్థించారు. బోనాల ఉత్సవాల్లో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిక్కిరిసిపోగా, సంప్రదాయ బోనాలు, పోతురాజుల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

