. . . ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ప్రయాణికుల భద్రతే సంస్థకు అత్యంత ముఖ్యమని, డ్రైవర్లు, సాంకేతిక సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలని ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సోలమన్ సూచించారు. టీజీఎస్ఆర్ టీసీ నిజామాబాద్ రీజియన్ పరిధిలోని నిజామాబాద్ బస్ స్టేషన్, నిజామాబాద్-2 డిపోను ఆయన శుక్రవారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్-2 డిపో పరిధిలోని ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, ఆపరేషన్, ఛార్జింగ్ వ్యవస్థ, భద్రతా చర్యలపై అధికారులతో సమీక్షించారు. రీజియన్లో మొత్తం 89 ఎలక్ట్రిక్ బస్సులు ఉండగా, ప్రస్తుతం 35 ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే ఆపరేషన్లో ఉన్నట్లు అధికారులు వివరించారు. ఇటీవల కొన్ని ఎలక్ట్రిక్ బస్సుల్లో సాంకేతిక సమస్యలు, ఆకస్మికంగా మంటలు చెలరేగే ఘటనల నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి బస్సును పూర్తిస్థాయిలో సాంకేతికంగా తనిఖీ చేసిన అనంతరమే ప్రయాణికుల సేవలకు వినియోగించాలని, బ్యాటరీ, వైరింగ్, ఛార్జింగ్ వ్యవస్థ, ఉష్ణోగ్రత నియంత్రణ తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అనంతరం నిజామాబాద్ బస్ స్టేషన్లో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, బస్సుల రాకపోకలు, సమాచార బోర్డులు తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రముంలో నిజామాబాద్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ పి.జ్యోతి, నిజామాబాద్ – 1 డిపో మేనేజర్, నిజామాబాద్-2 డిపో మేనేజర్, డిపో అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

