వెబ్ న్యూస్, బతుకమ్మ: వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యసభలోను ఆమోదం పొందింది. ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు వెళ్లనుంది. రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుపై అర్ధరాత్రి వరకు వాడీవేడిగా చర్చ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు లోపాలు ఎత్తి చూపాయి. ఈబిల్లుతో ముస్లింలకే లాభమని.. బిల్లు ఆమోదంతో ముస్లిమేతరులు ఈవ్యవహారాల్లో జోక్యం చేసుకోలేరని ప్రభుత్వం పేర్కొంది. ఈబిల్లు మతానికి సంబంధించింది కాదని.. ఆస్తి. దాని నిర్వహణకు,అవినీతిని నిర్మూలించడమే ఈబిల్లు లక్ష్యమని తెలిపింది. వక్ఫ్ బిల్లుపై బుధవారం లోక్ సభలో 14 గంటలకు పైగా చర్చ జరిగింది. అనంతరం స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు.

చరిత్రాత్మక మలుపు ప్రధాని మోదీ పోస్ట్
వక్ఫ్ బిల్లును పార్లమెంట్ ఆమోదించడంపై ఇదో చరిత్రాత్మక మలుపు అని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బిమ్ స్టెక్ సదస్సు నిమిత్తం థాయ్ లాండ్ లో ఉన్న మోదీ ’ఎక్స్‘ వేదికగా స్పందించారు. కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీ తనం లోపించిందని, తాజా బిల్లుతో ఇన్నాళ్లూ అట్టడుగున ఉండిపోయిన వర్గాలకు మేలు చేకూరుతుందని, వారి గళం వినిపించే అవకాశం దక్కుతుందని పోస్ట్ చేశారు.

