- ఎస్టిమేసన్ లేకుండానే పనులు
- శాఖను నష్ట పరుస్తున్న సిబ్బంది
ఇందూర్, బతుకమ్మ: డబ్బులు మాట్లాడుకొని సైడ్ అలారంలు వేస్తూ శాఖను నష్ట పరుస్తున్న సంఘటన నిజామాబాద్ నగరంలో జరుగుతోంది. సెక్షన్ 8 పరిధిలోని పిఎఫ్ వెనుక గల ఆనంద్ నగర్, సీతారాంనగర్ కాలనీ, బ్యాంక్ కాలనీ, సాయినగర్ 1,2,3, సంతోష్ నగర్ లలో ఎస్టిమేసన్లు వేయకుండానే పనులు చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. దీని వల్ల సంస్థకు డిడి రూపంలో రావాల్సిన డబ్బులు రాకుండా పోతున్నాయి. ప్రమాదభరితంగా ఉంటున్న తీగలను దూరం జరిపించాలనే తపన ఇంటి యజమానులకు ఉంటుంది. విద్యుత్ తీగలు ఇంటికి దగ్గ్గరగా ఉంటున్నాయని ధూరం జరపాలని క్షేత్ర స్థాయిలో ఉన్న సిబ్బందిని ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించుకొని ఎస్టిమేసన్ వేస్తే చాలా ఖర్చు అవుతుందని వినియోగదారునికి భయం కలిగేలా చేస్తున్నారు.

ఎస్టిమేసన్ (అంచనా)వేసి మంజూరి కోసం పంపించాలి, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సంస్థకు డిడి రూపంలో డబ్బులు చెల్లించాలి. ఇది పూర్తయ్యాక పెద్ద సార్లకు ముడుపులు ఇవ్వాల్సి ఉంటుందని వైర్లు జరిపించుకోవాలనుకునే వారికి విడమర్చి చెప్తున్నారు. తక్కువ అయ్యేలా చూడాలని వినియోగదారుడు కోరితే సుమారు 20 వేలు ఇస్తే పని పూర్తి చేస్తామని సిబ్బంది పేర్కొంటున్నారు. బేరాలు ఆడగా 15 వేలు తగ్గకుండా 20 వేలు దాటకుండా తీసుకొని సైడ్ అలారంలను బిగించేస్తున్నారని తెలిసింది. ఈ సెక్షన్ పరిధిలోని కొన్ని కాలనీలలో సుమారు 50 వరకు ఎస్టిమేసన్ లేకుండానే పనులు చేసినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.

