. . . పోలీస్ సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ క్యాంప్
. . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కూడా విధి నిర్వహణలో భాగంగానే భావించి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. మంగళవారం నగరం లో బ్రిడ్జి గ్యాప్ హాస్పిటల్, ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్, మేఘన డెంటల్ హాస్పిటల్, లెజిట్ డయాగ్నొస్టిక్స్ వారి సౌజన్యంతో పోలీస్ శాఖ సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం అనేది ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండే అత్యంత బాధ్యతాయుతమైన సేవని, ఈ విధి నిర్వహణలో పోలీసులు అనేక రకాల శారీరక, మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటారన్నారు. అసమయ భోజనం, నిద్రలేమి, నిరంతర విధులు, ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందన్నారు.

క్యాన్సర్ అనేది ముందస్తుగా గుర్తిస్తే సమర్థవంతంగా చికిత్స చేయగలిగే వ్యాధి అని, అవగాహన లోపం, నిర్లక్ష్యం వల్ల చాలామంది ఆలస్యంగా వైద్యులను సంప్రదిస్తుంటారన్నారు. ప్రారంభ దశలోనే క్యాన్సర్ను గుర్తించడం ద్వారా చికిత్స విజయవంతం కావడమే కాకుండా ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చని, అందుకే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరమని తెలిపారు. పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ బ్రిడ్జ్ గ్యాప్ హాస్పిటల్, ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్, మేఘనా డెంటల్ హాస్పిటల్, లెజెండ్ డయాగ్నొస్టిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమమని, ఈ కార్యక్రమంలో వైద్యులు అత్యాధునిక పద్ధతులతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, క్యాన్సర్ లక్షణాలు, నివారణ చర్యలు, జీవనశైలిలో పాటించాల్సిన జాగ్రత్తలపై విలువైన సూచనలు అందించడం అభినందనీయమన్నారు.

ప్రతి పోలీసు సిబ్బంది ధూమపానం, పొగాకు, గుట్కా, మద్యపానం వంటి ఆరోగ్యానికి హానికరమైన అలవాట్లకు దూరంగా ఉండాలని, సమతుల్య ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని నియంత్రించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన పోలీసు సిబ్బందే ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించగలరని, అందుకే పోలీసు శాఖలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ ఆరోగ్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన బ్రిడ్జ్ గ్యాప్ హాస్పిటల్, ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్, మేఘనా డెంటల్ హాస్పిటల్ యాజమాన్యాలకు, లెజిట్ డయాగ్నస్టిక్స్, వైద్య బృందాలకు, కార్యక్రమ నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ తరఫున హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసారు.

ఈ క్యాంపు ఐదు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్క సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి ఓరల్ చెకప్, చెస్ట్ ఎక్స్ రే, ఆర్.బి.యస్ టెస్ట్, ప్రొటెస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసిపి ప్రకాష్ యాదవ్, నిజామాబాద్ పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరళ, ఇందుర్ క్యాన్సర్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అమర్ దీపిక, అనాలజిస్ట్ డాక్టర్ పనస అరవింద్, సర్జికల్ అనాలజిస్ట్ డాక్టర్ కార్తీక్, ఆర్.ఎం.ఓ డాక్టర్ రవీంద్రనాథ్ సారీ, అసోసియేట్ ప్రొఫెసర్ మేఘన డెంటల్ కాలేజ్ డాక్టర్ ఆదిత్య తేజ, రిజర్వ్ ఇన్స్ పెక్టర్ (అడ్మిన్) ధరణి కుమార్, (వెల్ఫేర్) సతీష్, రూరల్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్, పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

