హైదరాబాద్,బతుకమ్మ : అందెశ్రీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందెశ్రీ మరణం వ్యక్తిగతంగా తనకు, తెలంగాణ సమాజానికి తీరనిలోటు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో తెలంగాణ గురించి అనేక విషయాలు ఆయనతో చర్చించినట్లు తెలిపారు. అందెశ్రీ అంత్యక్రియల అనంతరం ఘట్ కేసర్ లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అందెశ్రీ ప్రతి పాట తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిందన్నారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామన్నారు.
అందెశ్రీ పాడె మోసిన రేవంత్
అందెశ్రీ అంత్య క్రియలు ఘట్ కేసర్ లోని ఎన్ఎఫ్ సీ నగర్ లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మంగళవారం ముగిశాయి. అంతిమ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, అడ్లూరి, జూపల్లి , కాంగ్రెస్ నేత వీహెచ్ సాహితిఅభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అంతకు ముందు అందెశ్రీ పార్థివ దేహానికి రేవంత్ నివాళులు అర్పించి ఆయన పాడెను మోశారు. కుటంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం కుమారుడు దత్త సాయి తలకొరివి పెట్టగా అందెశ్రీ అంత్యక్రియలు ముగిశాయి.
