బతుకమ్మ, బోధన్ : నిజాంబాద్ జిల్లా, బోధన్ మండలం, పెగడపల్లి గ్రామంలో ఎద్దుల పొలాల అమావాస్య సందర్భంగా సంప్రదాయ పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. సంవత్సరం పొడవునా రైతుకు అండగా నిలిచి పంట పండించడంలో తోడ్పడే ఎద్దులను ప్రత్యేకంగా పూజించడం మన సంస్కృతి సాంప్రదాయం లో భాగమని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద ఎద్దులకు పూజలు చేసి, మందిరం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ఈ సందర్భంగా రైతు ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తూ “రైతే రాజ్యం, రైతే వెన్నెముక” అని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ లక్ష్మారెడ్డి, హనుమాన్ కమిటీ చైర్మన్ లక్ష్మణ్, మేడి రవి, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
