కామారెడ్డి, బతుకమ్మ :
రిజర్వేషన్ డే సందర్భంగా సామాజిక న్యాయం, విద్యా, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల అమలుకు పునాది వేసిన మహనీయుడు ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి వేడుకలను ఆదివారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ, భారతదేశంలో సామాజిక సమానత్వం సాధనకు, విద్యా అవకాశాల విస్తరణకు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఛత్రపతి సాహు మహారాజ్ చేసిన కృషి చారిత్రకమని కొనియాడారు. రిజర్వేషన్లు దానం కాదని, శతాబ్దాలుగా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు కల్పించిన రాజ్యాంగబద్ధమైన హక్కులని పేర్కొన్నారు. సామాజిక న్యాయ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రాజ్యాంగ విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మల్లన్న, క్యాతం సిద్ధిరాములు, ఆకుల బాబు, జీవియం విఠల్, గంగారాం, యాదన్న, లింగం, శ్రీహరి, నరేందర్, గఫూర్ శిక్షక్, అశోక్, శంకర్, రాజేష్, చంద్రశేఖర్, సంగమేశ్వర్, శివరాములు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి నాయకులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.

