నిజామాబాద్, బతుకమ్మ : ఎంఎస్పీ మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని ఈ పార్లమెంట్ సమావేశాల్లో తీసుకురావాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం అర్సపల్లి గ్రామ కచేరిలో బి. సాయిలు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో భూమయ్య మాట్లాడారు. దేశంలో వివిధ ఉత్పత్తులను తయారు చేస్తున్న వాటి యజమానులు తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించుకుంటున్నారు. పంట పండించే రైతు మాత్రం తన పంటలకు ధర నిర్ణయించుకునే అవకాశం లేదన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ఇవ్వకపోయినా కనీసం మద్దతు ధరలను స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు C2 + 50% అమలు చేయాలన్నారు. ఇది పార్లమెంటు చట్టం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ వనరులను, పచ్చటి పంట పొలాలను, భూములను బడా కార్పొరేట్లకు అప్పగించాలని చూస్తోందని విమర్శించారు. రైతు వ్యతిరేక చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలన్నారు. భవిష్యత్తులో రైతు కూలీలను ఐక్యం చేస్తూ బలమైన రైతు ఉద్యమాలు చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు బీ. సాయిలు, జిల్లా నాయకులు కె. గోపాల్, శ్రీనివాస్ రెడ్డి,నాయక్ వాడి రమేష్, దండు జాలెందర్, బెండ గంగాధర్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
