- సప్లిమెంటరి పరీక్షల హల్ టికెట్ జారీ చేయని బోర్డు
- విద్యార్థిని విద్యా సంవత్సరం లాస్
- బాధ్యులపై చర్యలకు డిమాండ్
నిజామాబాద్, బతుకమ్మ: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థీ ఫీజు చెల్లించిన విద్యాశాఖాధికారులు అప్ లోడ్ చేయడంలో నిర్లక్ష్యం చేయడంతో బోర్డు హాల్ టికెట్ జారీ చేయలేదు. దానితో విద్యార్థి ప్రస్తుతం విద్యా సంవత్సరం లాస్ అయ్యే పరిస్థితి నెలకొంది. నవీపేట్ మాడల్ స్కూల్ లో ఇటీవల ఇంటర్ ఫలితాలలో ఒక సబ్జెక్ట్ తప్పిన విద్యార్థిని చెల్లించిన పరీక్షఫీజును మాడల్ స్కూల్ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో విద్యార్థిని పరీక్షకు హాజరుకాలేకపోయింది. ఒక ఏడాదిపాటు విద్యాసంవత్సరం నష్టపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. నవీపేట మాడల్ స్కూల్లో మాక్లూర్ మండలం వల్లబాపూర్ గ్రామానికి చెందిన వర్ష 2023-25 విద్యా సంవత్సరంలో ఎంపిసి చదివింది. ఇటీవల వెలువడిన ఫలితాలలో సీనియర్ ఇంటర్లో గణితం సబ్జెక్టుకు సంబంధించి సప్లిమెంటరీ ఫీజు చెల్లించింది. కాని మాడల్ స్కూల్ అధికారుల నిర్లక్ష్యవైఖరి వల్ల పరీక్ష ఫీజును చెల్లించలేదు. తీరా పరీక్షలు ప్రారంభమయ్యే సరికి ఆన్ లైన్ లో హాల్ టికెట్ కోసం ప్రయత్నించగా విద్యార్థినికి హాల్టికెట్ రాలేదు. ఈ విషయంపై విద్యార్థినితో పాటు తల్లిదండ్రులు మాడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ను ప్రశ్నించగా పొరపాటు జరిగిందని అధికారులను కలిసి సమస్య పరిష్కారిస్తామని పేర్కొన్నారు. కాని వర్ష ఈ ఏడాది పరీక్షలు రాసే అవకాశం కోల్పోయింది. ఏడాది విద్యాసంవత్సరం నష్టపోయామని విద్యార్థిని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో వర్ష తల్లిదండ్రులు శనివారం జిల్లా కలెక్టర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా విద్యాశాఖాధికారులు నిలువరించారు. విద్యార్థిని ఫలితాల విషయంలో రికౌంటింగ్ లో పాస్ అయ్యేలా చేస్తామని బుకాయించారు. కాగా ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారి ఆశోక్ను వివరణ కోరగా తన దృష్టికి రాలేదని పరిశీలిస్తామన్నారు.
