ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి పురపాలక సంఘం పరిధిలోని 11వ వార్డు (విలీన గ్రామాలైన లింగారెడ్డిపేట)లో మున్సిపల్ నిధుల ద్వారా రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్లు,డ్రైనేజీ నిర్మాణ పనులకు మదన్ మోహన్ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా లింగారెడ్డిపేటలో కమ్యూనిటీ హాల్ మరమ్మతుల నిమిత్తం మున్నూరు కాపు సంఘానికి రూ.5 లక్షలు, ముదిరాజ్ సంఘానికి రూ.5లక్షలు మంజూరు కాపీలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ వాడలో అంగన్వాడి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. లింగారెడ్డిపేట ప్రాధమిక పాఠశాల ఏర్పాటు కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం జీవోను మంజూరు చేసిందని, పాఠశాల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వము చేయలేని అనేక అభివృద్ధి పనులను తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అమలు చేస్తున్నానని ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు. కొత్త బస్టాండ్, సెంట్రల్ లైటింగ్, నూతన రోడ్లు, డ్రైనేజీలు, పెద్ద చెరువు (మినీ ట్యాంక్ బండ్) సుందరీకరణ, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించడం వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయనే అంశంపై తీవ్రంగా మండి పడ్డారు.అభివృద్ధే తమ జవాబు అని, ప్రజలే తమ బలం అని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో నిలిపే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని తెలిపారు. అభివృద్ధి పనుల్లో ఎక్కడా రాజీ పడేది లేదని, ప్రతి వార్డు, ప్రతి కాలనీ సమగ్ర అభివృద్ధే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.


