నిజామాబాద్, బతుకమ్మ : యోగా శిక్షకులకు కనీస వేతనాలు అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య అన్నారు. జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పురుషోత్తం అధ్యక్షతన నిర్వహించిన యోగా శిక్షకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న యోగా శిక్షకులకు పని భద్రత కల్పించి రూ. 26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత రెండు సంవత్సరాల క్రితం ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం యోగా శిక్షకులను నియమించిందన్నారు. వారికి ప్రభుత్వం ప్రతినెల వేతనాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి యోగా శిక్షకులందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు టి. చక్రపాణి, నాయకులు ప్రవీణ్, శ్రీనివాస్, విజయేందర్, స్వాతి, నమ్రత, యోగా శిక్షకులు పాల్గొన్నారు.
