. . . స్నేహితురాలి సహాయంతో చోరి
బతుకమ్మ, నిజామాబాద్ : చేసిన అప్పులు తీర్చేందుకు దారి తెలియక ఏకంగా దొంగతనం చేయాలని నిర్ణయించాడు ఓ యువకుడు. అక్కడ ఇక్కడ చేస్తే దొరుకుతామని తెలిసిన వారయితే సులువుగా దొంగతనం చేయవచ్చని ప్లాన్ చేసి ఏకంగా మేనత్త మెడలో నుంచి బంగారు గొలుసును చోరి చేశాడు. అందుకు స్నేహితురాలి సహాయం తీసుకున్న ఘటన పోలీసులు అరెస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది.కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఎస్సై అనిల్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కామారెడ్డికి చెందిన మ్యాడం సంతోష్ కు ఇటీవల కాలంలో అప్పులు ఎక్కువయ్యాయి. అతడు స్థానికంగా ఒక బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు. అక్కడే పరిచయమైన స్నేహితురాలికి కూడా అవే సమస్యలు ఉండడంతో ఇద్దరు కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించారు. అందుకు చైన్ స్నాచింగ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే గతంలో అనుభవం లేకపోవడంతో అది సాధ్యం కాలేదు. మ్యాడం సంతోష్ కు మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తాండలో రాజవ్వ అనే మేనత్త ఉంది. ఆమె ఒంటరిగా ఉండడం, ఒంటిపై బంగారు గొలుసు ఉండడంతో దానిని తస్కరించాలని ప్లాన్ చేశారు. ఈ నెల 2న తన స్నేహితురాలితో కలిసి సంతోష్ బైక్ మీద మేనత్త ఇంటికి ముసుగులో వెళ్లి ఒంటరిగా ఉన్న ఆమె మెడలోని గొలుసును తెంపుకుని పరారీ అయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తుండగా శనివారం మాచారెడ్డిలో పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగాసంతోష్ అతని స్నేహితురాలు అనుమానాస్పదంగా కనిపిస్తుండగా పట్టుకుని విచారించడంతో గొలుసు చోరి కేసు కొలిక్కి వచ్చింది. వారు దొంగలించిన పుస్తెలతాడుతో పాటు బైక్ ను సీజ్ చేసి ఇద్దరిని రిమాండ్ కు పంపినట్లు ఎస్సై అనిల్ తెలిపారు.
