లింగంపేట్, బతుకమ్మ :
లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించిన అనంతరం సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి అంజల్ రెడ్డి మాట్లాడుతూ పూర్వ ప్రాథమిక తరగతుల ప్రారంభించడం పట్ల ఉపాధ్యాయుల కృషిని ఎంఈఓ అభినందించారు.

పూర్వ ప్రాథమిక తరగతుల విద్యా బోధనకు నియమించిన ఇన్స్ట్రక్టర్, ఆయా, ఉపాధ్యాయులకు సూచనలు, సలహాలు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుంది కావున చిన్నారుల తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ గర్ల్స్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, గ్రామ ఉపసర్పంచ్ సంజీవ్, వార్డ్ మెంబర్ ముకుంద రెడ్డి, పాఠశాల హెచ్ఎం దామోదర్, సిఆర్పి సత్యనారాయణ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

