ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో పీఏసీఎస్ ఛైర్మన్, తెలంగాణ మార్క్ ఫెడ్ ఛైర్మన్ మార గంగారెడ్డి అవినీతికి పాల్పలడ్డాడంటూ శుక్రవారం అదే గ్రామానికి చెందిన వినోద్ రెడ్డి రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంకాపూర్ గ్రామంలోని సొసైటీకి చెందిన గోదాం అమ్మిన డబ్బులు రూ.25లక్షలు, విరాళంగా వచ్చిన మరో రూ.5లక్షలకు సంబంధించిన లెక్కలు చూపడం లేదన్నారు. గత నెలలో రూ.30లక్షలకు సంబంధించిన లెక్కలు చూపాలని లిఖిల పూర్వకంగా పీసీఎస్ సెక్రటరీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. దీంతో పీఏసీఎస్ ఛైర్మన్ ఆగ్రహానికి గురై గ్రామ వీడీసీని ఫిర్యాదు చేశాడని తెలిపారు. దీంతో తనకు వీడీసీ సభ్యులు తనకు రూ.12వేలు జరిమానా విధించారని తెలిపారు. వచ్చే నెలలో లెక్కలు చూపుతామని వీడీసీ సభ్యులు హామీ ఇచ్చారని అన్నారు. దీంతో రాజీపడ్డానని పేర్కొన్నారు. నెల రోజులు గడుస్తున్నా లెక్కలు చూపకపోవడంతో తాను రిలే నిరాహారదీక్ష చేస్తున్నానని తెలిపారు. పరోక్షంగా గ్రామంలోని కొందరు వినోద్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నా.. గ్రామ వీడీసీకి భయపడి ముందుకు రావడానికి జంకుతున్నట్లు సమాచారం. ఒక్కడే టెంట్ వేసుకుని సెంటర్లో నిరాహార దీక్ష చేస్తున్న విషయాన్ని తెలుసుకుని వీడీసీ అధ్యక్షులు నల్ల మోహన్ రెడ్డి వినోద్ రెడ్డిని బెదిరింపులకు గురిచేయగా తాను ఎవరికీ భయపడనని, గ్రామం కోసం చేస్తున్నానని తెలిపినట్లు సమాచారం. దీంతో వినోద్ రెడ్డి రిలే నిరాహార దీక్ష అంకాపూర్ గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

