జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు
బతుకమ్మ, జుక్కల్ : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు అన్నారు. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశ 13వ ప్రధానమంత్రిగా 2004 నుండి 2014 వరకు కొనసాగి, దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి గొప్ప కృషి చేసిన ప్రముఖ నాయకుడని తెలిపారు. 1932లో జన్మించిన ఆయన, ఆర్థిక శాస్త్రంలో విశిష్ట పరిజ్ఞానం కలిగి ఉన్నారన్నారు. 1991లో భారత ఆర్థిక మంత్రిగా సేవలు నిర్వహించినప్పుడు దేశ ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసి, భారత ఆర్థిక వ్యవస్థను బలపరిచిన ఘనత ఆయనదేనని తెలిపారు. ప్రధానమంత్రిగా పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాలలో గణనీయమైన మార్పులకు నాంది పలికారని తెలిపారు. మన్మోహన్ సింగ్ రాజకీయ జీవితంలో సాదకుడిగా, నిశ్శబ్దంగా పనిచేసే వ్యక్తిగా పేరుగాంచారని తెలిపారు. ఆయన ఆర్థిక విశ్లేషణ, పారదర్శకత, నిబద్ధత దేశ ప్రజల మనసుల్లో స్ఫూర్తిని నింపాయన్నారు. ఈ కార్యక్రమంలో కల్లాలి సర్పంచ్ రమేష్ దేశయ్, మద్నూర్ ఏఎంసీ చైర్మన్ రమేష్, సొసైటీ చైర్మన్ శివానంద్, ఇమ్రాన్ ఖాన్, రాజు పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
