. ఏడాదిన్నర పాపతో కలిసి చెరువులో దూకిన తండ్రి
. భార్యను ఉద్దేశించి సుసైడ్ లెటర్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: ‘జీవితంలో ఏదీ సాధించలేకపోతున్నా.. నాకు చావే శరణ్యం.. నన్ను క్షమించు’ అంటూ భార్యను ఉద్దేశించి సుసైడ్ నోట్ రాసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణం తరువాత రెండో పెళ్లి చేసుకోవాలని భార్యను ఉద్దేశించి సుసైడ్ నోట్ రాసిన అతడు.. బ్రెయిన్ సరిగా ఎదగని తన కూతురు భార్యకు అడ్డు కాకూడదని ఆమెను వెంట తీసుకువెళ్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హృదయ విదారక ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ నగరంలోని సీతారాంనగర్ కాలనీ(గాజుల్ పేట్)కి చెందిన రఘుపతి క్రాంతికుమార్ (35)కు భార్య, ఇద్దరు కూతుళ్లు. ఏడాదిన్నర వయస్సున్న పెద్ద కూతురికి చిన్ననాటి నుంచి మెదడు ఎదుగుదల లేకపోవడంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఈ క్రమంలోనే తాను జీవితంలో ఏదీ సాధించకపోతున్నానని జీవితంపై విరక్తి చెందిన క్రాంతి కుమార్ సోమవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో పాపతో కలిసి న్యాల్ కల్ చెరువు వద్దకు వెళ్లి అందులో దూకాడు. ధర్మారం గురుకులంలో డాటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేసిన క్రాంతికుమార్ తెలంగాణ జాగృతిలో చురుగ్గా పని చేశారు.
