ఎల్లారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో విషాదం చోటుచేసుకుంది. హజీపూర్ గ్రామానికి చెందిన రాజిరెడ్డి (47) తన ఇంట్లో కూలర్ కు శుక్రవారం మరమ్మతులు నిర్వహిస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో తీవ్రగాయాలు కావటంతో కుటుంబీకులు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య సునీత, ఇద్దరు కూతుళ్లు శిరీష,శ్రావణి ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

