కామారెడ్డి, బతుకమ్మ :
రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని వీసా ప్రాసెస్ ఫీజుల పేరిట 9 లక్షలు వసూళ్ళు చేసి పరారీలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. సోమవారం డీఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మాచారెడ్డి మండలం మైసమ్మ చెరువు తాండకు చెందిన భూక్యనరేష్ అతని స్నేహితులకు నిజామాబాద్ కు చెందిన గాలేటి వెంకటయ్య ఆలియాస్ వెంకటేష్ మరో ఇద్దరు కలిసి రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.9.37 లక్షలను తీసుకున్నారు. వర్క్ పర్మిట్ వీసాలు ఇప్పిస్తామని నకిలీ వీసాలు అంటగట్టి పరారీ అయ్యారు. పాస్ పోర్టులు కూడా వెంకటయ్య వద్ద ఉండడంతో అతని కోసం గాలించిన దొరకకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా సోమవారం మాచారెడ్డి మండల కేంద్రంలో అనుమానస్పదంగా తిరుగుతున్న వెంకటయ్యను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అతని వద్ద రూ.45 వేల నగదు, బైక్, నకిలీ వీసాలను, మూడు పాస్ పోర్టులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వెంకటయ్యతో పాటు మరో ఇద్దరు సహకరించారని, వారిపై కేసు నమోదు చేసి గాలిస్తున్నట్లు తెలిపారు. విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేస్తే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని డీఎస్పీ మధుసూదన్ రెడ్డి తెలిపారు.

