నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈనెల 23, 24, 25 తేదీలలో జరిగే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ యు 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పీడీఎస్ యూ నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి, శ్రామిక భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్ యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కర్క గణేష్, ఎల్.అనిల్ కుమార్ లు మాట్లాడుతూ, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, విద్యారంగ సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటాలు నిర్వహించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, మెస్ కాస్మోటిక్ చార్జీలు సకాలంలో ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, పాఠశాలల్లో పెండింగ్ లో ఉన్న మధ్యాహ్న భోజన పథకం బిల్లులు విడుదల చేయాలని అనేక పోరాటాలు చేసారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, కేజీబీవీ, గురుకులాల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పోరాడిందన్నారు. ఖమ్మంలో జరగనున్న ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 23వ రాష్ట్ర మహాసభలలో గత పోరాటాలను సమీక్షించుకొని, కామ్రేడ్ భగత్సింగ్, జార్జిరెడ్డి, జంపాలా చంద్రశేఖర్ ప్రసాద్, కోలాశంకర్, రంగవల్లి, శ్రీపాద శ్రీహరి స్పూర్తితో భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు భారీగా తరలి మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు అశుర్, వైష్ణవి, నసీర్,నితిన్, సహాయ కార్యదర్శులు గణేష్, వినోద్, సృజన్, జిల్లా నాయకులు రేహాన్,శ్రావణి,దీపిక,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
