ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలో నవంబర్ 28 ,29 తేదీలలో జరిగే పి డి ఎస్ యూ నిజామాబాద్ 23వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ కోరారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో పి డి ఎస్ యూ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి డి ఎస్ యూ) 50 ఏండ్లుగా విద్యార్థి సమస్యలపై పోరాడి అనేక విజయాలు సాధించిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు బడ్జెట్ లో తక్కువ నిధులు కేటాయిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్విర్యం చేస్తున్నారని అన్నారు. నూతన జాతీయ విద్యావిధానాన్ని తీసుకువచ్చి అశాస్త్రీయ పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నారని, దేశంలో కార్పొరేట్, కషాయికరణ విద్యకు వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్మిస్తూ విద్యార్థులను చైతన్యవంతం చేయడానికి విద్య రంగ సమస్యలను చర్చించి భవిష్యత్తు కార్య చరణ రూపొందించుకోవడానికి ఆర్మూర్ పట్టణంలో 23వ జిల్లా మహాసభలను నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు, మేధావులు ప్రజాస్వామ్యవాదులు ప్రజాసంఘాల నాయకులు అందరూ హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, ఆర్మూర్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు హుస్సేన్,రాహుల్,నాయకులు నరేష్,ప్రసాద్ , హనుమంత్ రెడ్డి,అనిల్,ప్రకాష్,సాయి కుమార్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
