. . . వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
. . . స్వామి వారికి ప్రత్యేక పూజలు
భిక్కనూరు, బతుకమ్మ :
భిక్కనూరు పట్టణ కేంద్రంలో వెలిసిన స్వయంభు సిద్ధ రామేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఆదివారం కన్నుల పండుగలా నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు ఆలయం వద్దకు చేరుకొని సిద్ధరామేశ్వరుడిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుండే ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయంలో ఆలయ కమిటీ, సిబ్బంది పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భిక్కనూరు పోలీసులు, భిక్కనూరు గురుకుల పాఠశాల ఎన్సిసి విద్యార్థులు, భిక్కనూరు చైతన్య విద్యార్థులు ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాలో నుండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

