ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్
నిజామాబాద్ సిటీ బతుకమ్మ : అత్యంత వివాదాస్పద, అసమర్ధ, అవినీతి మాక్లూర్ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టీ యూ) ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టీ.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ మాక్లూర్ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ (ఎస్.వో) అనురాధ సిబ్బందిపై వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. టీచర్లకు అక్రమ సంబంధాలు అంటగడుతున్నారన్నారు. ఫైన్ ల పేరుతో విద్యార్థుల నుండి వసూలు చేస్తున్నారన్నారు. వినాయక చవితి పండగ పేరుతో 9, 10 ఇంటర్ విద్యార్థుల దగ్గర నుండి 100/- రూపాయలు చొప్పున వసూలు చేశారన్నారు. స్వయంగా ఎస్.వో వేలం నిర్వహించి 10వ తరగతి విద్యార్థులతో 4600/- లడ్డును వేలం పాడించారన్నారు. వేలం పాట పాడకపోతే ఫెయిల్ అవుతారని బెదిరించారన్నారు. వేధించిందన్నాఎస్.వో విధుల్లో చేరినప్పటి నుండి తన ప్రవర్తనతో విద్యార్థులు, టీచర్లు, సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారన్నారు. ఎస్.వో గా విధుల్లో చేరి రెండు నెలల సమయం కూడా కాకుండానే ఇన్ని అరాచకాలు సృష్టించారనీ, తక్షణమే ఎస్.వో ను విధుల నుండి తొలగించాలన్నారు. లేనిచో వివిధ ప్రజా సంఘాలతో ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు లలిత, ఐ.ఎఫ్.టి.యు జిల్లా అధ్యక్షులు ఎం.ముత్తెన్న, జిల్లా ఉపాధ్యక్షులు డి.రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లేష్, జిల్లా నాయకులు డి.కిషన్, సాయన్న తదితరులు పాల్గొన్నారు.

