. . . 93 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు న్యాయం జరగాలి
. . . డా. విశారాదన్ మహారజ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్రంలో అగ్రకుల ఆధిపత్య వర్గాలకు సేవ చేసే బానిసలుగా, మట్టి మనుషులుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనారిటీలు జీవిస్తున్నారని, వారి జీవితమేంటో వారికి తెలియకుండానే వారి జీవితాన్ని ముగిస్తున్నారని డాక్టర్ విశారాదన్ మహారాజ్ అన్నారు. భారత రాజ్యాంగం చెప్పినట్టుగా ఎవరి కుల జనాభా ఎంత ఉన్నదో వారికంతా వాటా కావాలి అంతే ఆత్మగౌరవంతో బతకాలి అనే రాజ్యాంగ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ విశారదన్ మహరాజ్ నాయకత్వంలో పోరాటం నడుస్తోంది. ఈ పోరాటంలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ గ్రౌండ్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ, డీఎస్పీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు పది శాతం లేని రెడ్డి, కమ్మల చేతిలో నిజామాబాద్ బందీ అయిందని వారి చేతుల్లోనే భూమి, రాజ్యం, సంపద ఉందని.. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలంతా చైతన్యంతో బతుకుతూ వారి వాటా కోసం పోరాటం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. మొన్నటి ప్రభుత్వం జనాభా లెక్కలు ప్రకారం జిల్లాలో అగ్రకులాలైన రెడ్డి, కమ్మలు ఏడు శాతం లేరని, కానీ మొత్తం సంపద, రాజ్యం, భూమి వాళ్ళ చేతుల్లోనే పెట్టుకొని నోట్లో మట్టి కొట్టడం జరుగుతుందన్నారు. దీన్ని ప్రజలందరూ తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ జిల్లా సభ స్ఫూర్తితో రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఇదే స్థాయిలో సభలు నిర్వహిస్తామని, ఖచ్చితంగా మున్ముందు పెద్ద పెద్ద పోరాటాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ నాగం కుమారస్వామి, బీసీ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు రాఘవేంద్ర ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాసాల వినోద్ యాదవ్, రీజినల్ ఇన్చార్జిలు సుమన్, జిల్లా నాయకులు ప్రేమ్, మహిపాల్, అన్ని జిల్లాల జేఏసీ నాయకులు, రాష్ట్ర ప్రతినిధులు, జిల్లాలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, వేలాది మంది ప్రజానీకం పాల్గొన్నారు.

