నిజామాబాద్, బతుకమ్మ: భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ ఆధ్వర్యంలో 139వ మే డే వేడుకలను నగరంలోని అంబేడ్కర్ కాలనీలో ఉన్న హమాలీ యూనియన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సీపీఐ జెండాను పార్టీ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ ఎగురవేసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, కార్మిక చట్టాలను రద్దు చేయడం దారుణమన్నారు.
కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తున్నదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై అందరూ ఐక్యంగా ఉండి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి వై ఓమయ్య, బి రఘురామ్, అలీ ఇమ్రాన్, ఫిరోజ్, అంజలి, దేవేందర్, రాధాకుమార్ తదితరులు పాల్గొన్నారు.
