కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
పహల్గామ్ మృతులకు నివాళులు అర్పించిన సదస్సు
నిజామాబాద్, బతుకమ్మ : నిర్ణీత గడువు లోపు భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం దోహదపడుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. భూమి హక్కుల రికార్డులలో ఏవైనా లోటుపాట్లు, తప్పులు ఉంటే వాటిని సవరించుకునేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ నూతన ఆర్.ఓ.ఆర్ -2025 చట్టం వెసులుబాటు కల్పిస్తుందన్నారు. భీంగల్, వేల్పూర్ మండల కేంద్రాలలో భూభారతి చట్టంపై గురువారం రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. అంతకు ముందు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారికి ఈ సదస్సులో రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ హనుమంతు ఈ కొత్త చట్టంతో రైతులకు, ప్రజలకు చేకూరే ప్రయోజనాలు, చట్టంలో పొందుపర్చిన కీలక అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా పట్టా పాస్ బుక్కులలో సమగ్ర వివరాలతో, హద్దులను పేర్కొంటూ భూమి పటం (మ్యాప్) పొందుపరుస్తారని తెలిపారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయడానికి ముందు సర్వే మ్యాప్ రూపొందించి పట్టా పాస్ బుక్కుకు జత పరుస్తారన్నారు. ఆధార్ తరహాలోనే భూముల వివరాలతో కూడిన భూధార్ నెంబర్ కేటాయిస్తారని తెలిపారు. ఈ చట్టంలో ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసాయేతర భూములకు కూడా హక్కుల రికార్డు ఉంటుందన్నారు. అర్హులైన రైతులు ఈ చట్టంపై అవగాహనను పెంపొందించుకుని, భూ సమస్యలు ఉంటే గ్రామ సభలలో అధికారులకు అర్జీలు అందించి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సదస్సులో డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, ఆర్మూర్ ఆర్డీఓ రాజా గౌడ్, స్థానిక అధికారులు, మార్కెట్ కమిటీలు, సొసైటీల చైర్మన్లు, రైతులు పాల్గొన్నారు.

