హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని డిమాండ్ చేసినప్పటికీ, అప్పటి ఉమ్మడి పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం బోనాలను అధికారిక రాష్ట్ర పండుగగా ప్రకటించిందని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని రూ.1,800 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసి నిర్మించామని, బోనాల సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఆలయ కమిటీకి నిధులు కేటాయించామని చెప్పారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సంతోషంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, అనిల్ జాదవ్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

