బతుకమ్మ: బిచ్కుంద : తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని పద్మశాలి సంఘం అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ అన్నారు. శనివారం బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కండేయ మందిరం లో కొండా లక్ష్మణ్ బాపూజీ12వ వర్ధంతిని నిర్వహించారు. పద్మశాలి డివిజన్ అధ్యక్షులు డాక్టర్ రాజు బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజు మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేశారని, తొలిదశ తెలంగాణ విముక్తి ఉద్యమంలో వలస పాలనపై తీవ్ర నిరసన తెలిపి 1969లో మంత్రి పదవికి సైతం రాజీనామా చేసిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరసింహులు, బుర్రిసురేష్, ఖత్గవ్ మాజీ సర్పంచ్ హన్మండ్లు, పరమేష్, గంగాధర్ మరియు పద్మశాలి సోదరులు పాల్గొన్నారు.