వెబ్ న్యూస్, బతుకమ్మ : కేసీఆర్కు కుటుంబ సభ్యులతో ప్రాణహాని ఉందని, అందుకే సెక్యూరిటీ పెట్టుకున్నాడని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం రేవంత్ శాసనసభలో శనివారం మాట్లాడారు. బీఆర్ ఎస్ హయాంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే 2022 బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారని గుర్తు చేశారు. మహిళా గవర్నర్ ను అవమానించారన్నారు. ఆ తప్పు తాము చేయమన్నారు. గవర్నర్ వ్యవస్థను గౌరవించే బాధ్యత తమదన్నారు. ప్రతిపక్షం గవర్నర్ ప్రసంగంలో సూచనలు చేస్తే ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ శాసనసభకు వచ్చింది రెండే సార్లు అని అన్నారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకు కేసీఆర్ తీసుకున్న జీతభత్యాలు రూ.57 లక్షలు అన్నారు. ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుని రాష్ట్రాన్ని కర్మకు వదిలేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి కాని ప్రాజెక్టులను ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదన్నారు. తాను అడిగేవాటికి సమాధానం చెప్పాల్సి వస్తుందనే కేసీఆర్ ముఖం చాటేశారన్నారు. స్టేచర్ పట్ల ఉన్న ఆలోచన స్టేట్ ఫ్యూచర్ పట్ల లేదా అని విమర్శించారు. 2023లో ప్రజలు బీఆర్ స్ కు అధికారం నుంచి ప్రధాన ప్రతిపక్షంగా స్టేచర్ ఇచ్చారన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో గుండుసున్నా ఇచ్చారన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ మార్చురీలో ఉందని వ్యాఖ్యనించారు.
