కామారెడ్డి, బతుకమ్మ: ఇంటి రుణం తీసుకున్న వ్యక్తిని ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులు వేధించడంతో సదరు వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు..
రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామనికి చెందిన చిదుర విఠల్ ఫైవ్ స్టార్ ఫైనాన్స్ లో ఏడేళ్ల క్రితం రూ.7లక్షల రుణం తీసుకున్నాడు. అయితే డబ్బుల విషయంలో ఫైనాన్స్ ఉద్యోగులు తరచూ వేధిస్తుండడంతో విఠల్ తీవ్ర మానసిక ఒత్తిడికి గుయ్యాడు. నాలుగైదు రోజుల క్రితం విఠల్ ఇంటికి వచ్చిన ఫైనాన్స్ ఉద్యోగులు డబ్బులు చెల్లించకపోతే ఇంటిని వేలం వేస్తామని పక్కింటి వారికి చెప్పి వెళ్లిపోయారు. విషయం తెలిసి విఠల్ మరింత ఒత్తిడికి గురికావడంతో గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు.
విఠల్ ఏడేళ్ల క్రితం రూ.7లక్షల రుణం తీసుకుంటే ఇంకా రూ.9లక్షలు కట్టాల్సి ఉందని ఫైనాన్స్ ఉద్యోగులు వేధిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. లోన్ తీసుకున్న వారికి కనీసం ఇన్సురెన్స్ చేయించడం లేదని, వడ్డీ, చక్రవడ్డీ, బారువడ్డీ కలిపి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఫైవ్ స్టార్ ఫైనాన్స్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

