
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఖేలో ఇండియా సౌత్ జోన్ సైక్లింగ్ లీగ్ లో కర్నాటక రాష్ర్టంలోని విజయపురా జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో రెండు రోజుల పాటు కొనసాగిన సైక్లింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. వివిధ కేటగిరీల్లో కర్నాటక సైక్లిస్టులు కోకిలాచౌహాన్ గోల్డ్ మెడల్(10కి.మీ.), దీపిక సిల్వర్ మెడల్, జోత్యిరాథోడ్ బ్రౌన్ మెడల్ సాధించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మునిసపల్ కమిషనర్ మంద మకరందు మాట్లాడుతూ.. మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఇలాంటి పోటీలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. సైక్లింగ్ లీగల్ కు నిజామాబాద్ నగరం వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు. ఖేలో ఇండియా సౌత్ జోన్ సైక్లింగ్ లీగ్ నిర్వహకులకు అభినందనలు తెలిపారు. క్రీడాకారిణులకు సైక్లింగ్ అసోసియేషన్ తరఫున కమిషనర్ ప్రోత్సాహకంగా చెక్కులను అందజేశారు. తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు క్రుపాకర్ రెడ్డి, కార్యదర్శి విజయకాంత్, ఉపాధ్యక్షులు రాజ్ కుమార్ సుబేదార్, నర్సింగ్ రావు, సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
