కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన అత్యవసర పరిస్థితులు, ఆరోగ్య శాఖ సంసిద్ధత ఏర్పాట్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డా.రవీందర్ నాయక్, తెలంగాణా వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా.అజయ్ కుమార్ గురువారం పర్యవేక్షించారు. ఈ పర్యటన లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో గల అత్యవసర వైద్య సేవల సదుపాయాల గురించి ఆరా తీశారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని,ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు ప్రతి మండల స్ధాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలో గ్రామాల వారీగా ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరాలు ప్రతి రోజు నిర్వహించాలని, ఆరోగ్య శిబిరాల నివేదికలు రోజు వారీగా ఉన్నతాధికారులకు సమర్పించాలని సూచించారు. హౌసింగ్ బోర్డు కాలనీ , సత్య గార్డెన్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం లో ఆరోగ్య శాఖ తరపున ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దేవునిపల్లి ని సందర్శించి పరిశీలించి మందుల కొరత ఇతర మౌలిక అవసరాల కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి అని ఆదేశించారు. అధిక వర్షాల వల్ల ఏర్పడే సమస్యల వలన జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ తరపున ఏర్పాటు చేసిన అత్యవసర సేవలు , ఇతర ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో జిల్లా వైద్య, ఆరోగ్య శకాధికారి డా.చంద్రశేఖర్ , ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు , వైద్యు సిబ్బంది పాల్గొన్నారు.

