హైదరాబాద్, బతుకమ్మ : కొమురం భీం స్ఫూర్తితో జాగృతి సమస్యలపై పోరాటం చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం కొమురం భీం వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహానికి కవిత పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా కవిత మాట్లాడారు. కాంగ్రెస్ వచ్చాక గూడెలలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. మహిళలకు కనీసం ప్రసూతి సౌకర్యాలు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. . ఆదివాసీ విభాగం అధ్యక్షుడు లోకిని రాజు ఆధ్వర్యంలో ఆదివాసీలతో చర్చలు చేస్తున్నామన్నారు. ఆదివాసీల హక్కుల పోరాటం కోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. తమ జాతి కోసం ఎలా పోరాటం చేయాలో తరతరాలు చెప్పుకునేలా కొమురం భీం గొప్ప పోరాటం చేశారని గుర్తు చేశారు. ‘మావా నాటే మావా రాజ్’ అంటే మా గూడెంలో మా రాజ్యమే ఉండాలని ఆయన పిలుపునిచ్చారని పేర్కొన్నారు. జల్, జంగిల్, జమీన్ అనగా నీరు, అడవి, భూమి మీద ఆదివాసీలకే హక్కు ఉండాలని ఆయన పోరాటం చేశారన్నారు. నిజాం ప్రభుత్వాన్ని తలవంచేలా చేసి ఆదివాసీలు తమ సమస్యలు చెప్పుకునేలా దర్బార్ నిర్వహించేలా చేశారన్నారు. ఇప్పటికీ కొమురం భీం గౌరవార్థం ప్రజా దర్భార్ నిర్వహిస్తున్నమంటే అది ఆయన గొప్పతనమన్నారు. కొమురం భీం జోడే ఘాట్ వద్ద స్మృతి వనం కట్టుకున్నామన్నారు. తెలంగాణ వచ్చాక ఆయనకు తగిన గౌరవం ఇచ్చుకున్నామన్నారు. గుస్సాడీ ఉత్సవాల కోసం గత ప్రభుత్వం ఏటా ప్రతి గూడానికి రూ. 25 వేలు ఇచ్చేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుని ఈ ఉత్సవాల కోసం రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఉత్సవాలు ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబిస్తాయన్నారు. కచ్చితంగా గుస్సాడి ఉత్సవాలకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఆదివాసీ జాగృతి అధ్యక్షుడు లోకిని రాజు తదితరులు పాల్గొన్నారు.

