- డిసిసిబి బ్యాంకు ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డిసిసిబి పూర్వైభవం దిశలో సాగడం అభినందనీయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయం ను మంగళవారం ఆయన సందర్శించి బ్యాంకు యొక్క పరిస్థితి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి నాయకత్వం లో బ్యాంకు అభివృద్ధి తీరు అద్భుతమని కొనియాడారు. ఇదివరకు ఉన్న నిరర్ధక ఆస్తులను 17.35 శాతం నుండి 7.81 శాతమునకు తగ్గించారని,జిల్లా సహకార రంగం పునర్వైభవం దిశలో రమేష్ రెడ్డి నాయకత్వం అజరామరం అన్నారు. అధ్భుత ఆలోచన తీరుతో జిల్లా సహకార రంగం లో విలువైన,ఆచరణీయ సంస్కరణలు అమలు చేస్తున్నారని, ఇదే విధమైన పనితీరు మున్ముందు కనబరిచి రాష్ట్ర స్థాయి లో ముందు వరుస లో ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ఇంతటి ఘనత సాధించినందుకు అధ్యక్షులకు పాలకవర్గ సభ్యులను అభినందించారు. పూర్తి గా సహకరించి క్షేత్ర స్థాయి లో అమలుపరిచి అధ్భుత ఫలితాలకు సహకరించిన ముఖ్యకార్యనిర్వాణాధికారి, ఉన్నతాధికారులను,సిబ్బంది ను ప్రత్యేకంగా అభినందించారు. అధ్యక్షుల నేతృత్వం లో జిల్లా రైతాంగంనకు సహకార సంఘముల ద్వారా సహకార బ్యాంకు ద్వారా విశేష సేవలు అందిస్తున్నాయి, రైతులు యూరియా వాడకం తగ్గించి నానో యూరియా వాడి అధిక దిగుబడి పొందాలని, ప్రస్తుతం జిల్లా కి కోటా ప్రకారం రావలసిన 75000 మెట్రిక్ టన్నుల లో 71000 మెట్రిక్ టన్నులు ఇదివరకే వచ్చింది. మిగిలినవి కూడా త్వరలోనే వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నుడా అధ్యక్షులు కేశ వేణు, రాష్ట సహకార యూనియన్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు అంతరెడ్డి రాజారెడ్డి, బ్యాంకు పాలకవర్గ సభ్యులు, జిల్లా సహకార అధికారి శ్రీనివాస రావు, జిల్లా వ్యవసాయ అధికారి వాజీద్ హుస్సేన్ పాల్గొన్నారు.
