బతుకమ్మ, మోర్తాడ్: దుక్కి దున్ని పంట వేసి నీరుగట్టి మూడు నెలలు కంటికి రెప్పలా పంటను కాపాడి రైతు కండ్ల ముందుకొచ్చిన పంట చూసుకొని ఎన్నో ఆశలతో మనసు ఉప్పొంగింది. కానీ ప్రకృతి రైతు కళ్ళల్లో కనిపించిన ఆశలపై ఒక్కసారిగా ఊహించని విధంగా వచ్చిన వర్షం రైతుల ఆశలను తడిపేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మోర్తాడ్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం కురిసిన వర్షాలకు మక్కలు తడిసి ముద్దయినాయి. మొక్కజొన్న నూర్పిడి చేసి ఆరబెట్టి అమ్మడానికి సిద్ధం చేస్తుండగా వర్షం పడి తడవడంతో రైతన్నలు ఒక్కసారిగా ఇబ్బందికి గురయ్యారు. తడిసిన పంటకు ప్రభుత్వమే కొనుగోలు చేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని రైతులు పేర్కొన్నారు.