- మూడు రాష్ట్రాల జంక్షన్లో భద్రతా దళాల భారీ ఆపరేషన్
హైదరాబాద్, బతుకమ్మ : భారతదేశ అంతర్గత భద్రతకు దశాబ్దాలుగా సవాలుగా నిలుస్తున్న మావోయిస్టు ఉద్యమం భారీ ఎదురుదెబ్బను ఎదుర్కొంది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ త్రి జంక్షన్ అటవీప్రాంతంలో జరిగిన భద్రతా దళాల ఆపరేషన్లో అగ్ర మావోయిస్ట్ నాయకుడు మాడ్వి హిడ్మా హతమయ్యాడు. అనేక రాష్ట్రాల ఇంటెలిజెన్స్ సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్న హిడ్మా మరణం, నక్సలిజంపై జరుగుతున్న యుద్ధంలో కీలక మలుపుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఎన్కౌంటర్లో హిడ్మాతోపాటు ఆరుగురు తిరుగుబాటు దారులు మృతి చెందినట్లు సమాచారం. భద్రతా దళాల ఆపరేషన్ ప్రాంతంలో హిడ్మా భార్య రాజె అలియాస్ రాజక్క కూడా ఉన్నట్లు, ఆమె కూడా హతమైనట్లు సీనియర్ అధికారులు నిర్ధారించారు.
- హిడ్మా ఎవరు..?.. ‘యంగ్ టర్క్’ పతనం..
1981లో ప్రస్తుత ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలోని పునర్తి గ్రామంలో జన్మించిన మాడ్వి హిడ్మా, మావోయిస్టు శ్రేణుల్లో త్వరగా పైస్థాయిలకు ఎదిగాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA)లో బెటాలియన్ కమాండర్. సీపీఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ అత్యంత పిన్నవయస్కుడు. కమిటీలోని ఏకైక బస్తర్ ప్రాంత గిరిజన నాయకుడు. అతని తలపై ప్రభుత్వాలు రూ.50 లక్షల రివార్డు ప్రకటించాయి. దండకారణ్యం ప్రాంతంలో మావోయిస్టుల వ్యూహాలను పునర్నిర్మించిన వ్యక్తిగా హిడ్మా పేరు ప్రఖ్యాతులు పొందాడు. 2010 దంతెవాడ దాడి నుంచి 2021 సుక్మాబీజాపూర్ ఎదురుదాడి వరకు అనేక రక్తపాతం సంఘటనలకు అతడే ప్రధాన సూత్రధారి.
- నక్సలిజానికి కోలుకోలేని దెబ్బ..?
హిడ్మా హతమవ్వడంతో నక్సల్ ఉద్యమం తీవ్రమైన నేతృత్వ సంక్షోభంలోకి నెట్టబడిందని భద్రతా నిపుణులు భావిస్తున్నారు.
- నాయకత్వ హననం..
బస్తర్ ప్రాంత గిరిజనులను ప్రభావితం చేయగల శక్తి హిడ్మానే. అతని మరణంతో దిగువ స్థాయి క్యాడర్లో నిరుత్సాహం పెరిగే అవకాశం ఉందని అంచనా.
- ఇంటెలిజెన్స్ బలం..
అగ్ర నేతలు, వారి కుటుంబాలు కూడా భద్రతా దళాల వల నుంచి తప్పించుకోలేకపోవడం, ఇంటెలిజెన్స్ వ్యవస్థ సామర్థ్యాల పెరుగుదలను సూచిస్తోంది.
- పాతతరం నాయకుల బలహీనత..
గణపతి, తిరుపతి వంటి సీనియర్ నాయకులు ఇప్పటికే అనారోగ్యంతో ఉన్న నేపథ్యంలో, హిడ్మా దొరికిపోయిన తర్వాత మిగతా నేతలు ఎక్కువకాలం దాక్కునే పరిస్థితి కష్టమవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఒక మాజీ ఐపీఎస్ అధికారి వ్యాఖ్యానిస్తూ.. “హిడ్మా మరణం కేవలం ఒక నాయకుడి పతనం కాదు.. బస్తర్ అడవుల్లో మావోయిస్టు కదలికలకు ప్రధానమైన గిరిజన ముఖం కనుమరుగయ్యినట్టే. ఉద్యమం భవిష్యత్తు తీవ్ర అనిశ్చితిలో పడింది.” అని తెలిపారు.
- త్రి జంక్షన్ ఆపరేషన్.. మావోయిస్టు కంచె చీల్చిన భద్రతా బలగాలు..
ఏసీటీ త్రి జంక్షన్ (ఆంధ్ర, ఛత్తీస్గఢ్–తెలంగాణ సరిహద్దు) దశాబ్దాలుగా మావోయిస్టుల అతి కీలక స్థావరంగా ఉన్న ప్రదేశం. ఈ ప్రాంతంలోనే ఎన్కౌంటర్ జరగడం, దళాలు అడవుల్లో ఇటువంటి కోటను ఛేదించగల స్థాయికి ఎదిగినట్లు సూచిస్తుంది. ఇంకా ప్రాంతం ఖాళీ చేయించే పనులు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
- ఇక ముందు ఏమవుతుంది..?
లొంగుబాట్లు పెరగడం, నాయకత్వం లేకపోవడంతో చిన్న స్థాయి సభ్యుల లొంగుబాట్లు పెరగవచ్చని అంచనా.
దాడుల తీవ్రత తగ్గడం.. దండకారణ్యం, ఏసీబీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు గణనీయంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
- అభివృద్ధి కార్యక్రమాలకు ఊతం..
హింస తగ్గితే, విద్య, ఆరోగ్యం, రహదారులు వంటి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసే అవకాశం ఉంది.
- హిడ్మా పాత్ర ఉన్న ప్రధాన దాడులు..
దంతెవాడ దాడి – 2010: 76 మంది సీఆర్ఎఫ్ జవాన్లు మరణం.నక్సల్ హింస చరిత్రలో అత్యంత ఘోర దాడి.
దర్భా వ్యాలీ దాడి – 2013 : 30 మంది మరణం. కాంగ్రెస్ నాయకులు మహేంద్ర కర్మ, నంద్ కుమార్ పటేల్ సహా పలువురు హతులు.
సుక్మా, బుర్కాపాల్ దాడి – 2017 : 24 మంది భద్రతా సిబ్బంది మరణం.
సుక్మా–బీజాపూర్ సరిహద్దు దాడి — 2021 : 22 మంది భద్రతా దళాల సభ్యులు హతులు. హిడ్మా ఉచ్చులోకి దళాలను లాగిన ఘటనగా గుర్తింపు.
ఉర్పల్ మెట్ట దాడి — 2007 : హిడ్మా ఎదుగుదలకు కీలక మలుపు.
హిడ్మా ఎన్కౌంటర్తో మావోయిస్టు ఉద్యమం వెన్నెముక విరిగినట్టేనని భద్రతా వర్గాలు చూస్తున్నాయి.
మిగిలిన అగ్ర నాయకులు ఎంతకాలం భద్రతా దళాల వల నుంచి తప్పించుకోగలరన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.
దశాబ్దాల నక్సల్ హింసకు ఇది తుది దశగా మారుతుందా? అన్నది రాబోయే రోజులలో స్పష్టమవుతుంది.
