రుద్రూర్, బతుకమ్మ : ఎస్సీ వర్గీకరణ అమలుకై తలపెట్టినలక్ష డప్పులు, వేల గొంతుకల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మాదిగలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ నాయకులు సోంపుర్ పోచిరాం కోరారు. రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో ఆదివారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఉషం సాయికుమార్ ఆధ్వర్యంలో లక్ష డప్పులు, వేల గొంతుకల కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 7వ తేదీన హైదరాబాదులో ఎస్సీ వర్గీకరణ అమలుకై పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎల్బీ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మాదిగల భారీ సాంస్కృతిక ప్రదర్శన ర్యాలీ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం తక్షణమే ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన ప్రకటన చేస్తే ప్రభుత్వానికి విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. లేని పక్షంలో చావు డప్పులు కొడతామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మాదిగ సోదరులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఉషం సాయికుమార్, ఉపాధ్యక్షులు రామస్వామి సాయిరాం, కార్యదర్శి బుడ్డోల్ల నాగేష్, రవి, సంజీవ్, సాయి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
