నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షల నిర్వహణను జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరీక్షలు జరుగుతున్న కాకతీయ జూనియర్ కళాశాల, ఎస్సార్ జూనియర్ కళాశాల, వెక్టార్ జూనియర్ కళాశాల, సత్య ఒకేషనల్ జూనియర్ కళాశాల లను ఇంటర్ విద్య అధికారి తనిఖీ చేయగా జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లాలో 15 కేంద్రాలను తనిఖీ చేశారు. ఇంటర్ విద్య అధికారి రవికుమార్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో జియో ట్యాగింగ్ చేయాలని, కెమరాలు పని చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో నిబంధనల మేరకు పని చేయాలని ఆదేశించారు. చదివిన ప్రతి విద్యార్థికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో కెమెరాల ద్వారా హైదరాబాద్ నుండి కమిషనర్ పర్యవేక్షణ చేస్తున్నారని అన్నారు. ఈ తనిఖీల్లో పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజియుద్దీన్ పాల్గొన్నారు.

