జుక్కల్, బతుకమ్మ :
జుక్కల్ మండలంలోని అన్ని గ్రామాల్లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయాల నుంచి ప్రారంభమైన పెరేడ్ ప్రధాన వీధుల గుండా కొనసాగుతూ సంబంధిత కార్యాలయాల వరకు నిర్వహించారు. జుక్కల్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అధికారులు, ప్రజలు జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో గ్రామపంచాయతీ సర్పంచ్లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. జుక్కల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సావిత్రి సాయి గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్థానిక హైస్కూల్లో తిరుపతి రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పాఠశాలలో నిర్వహించిన సభలో సర్పంచ్ సావిత్రి సాయి గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి జుక్కల్ మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

