బిచ్కుంద, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని స్కాలర్స్ హై స్కూల్లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిచ్కుంద ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జాడ వినీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి జడ్జి జాడ వినీల్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులే భావి భారత పౌరులని, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. చట్టాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు బాధ్యతాయుతంగా ప్రవర్తించడం, గురువులు, తల్లిదండ్రులను గౌరవించడం, చిన్ననాటి నుంచే దేశభక్తి భావాన్ని పెంపొందించుకోవడం అవసరమని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, దేశభక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యవీర్తో పాటు బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

