ఏర్గట్ల, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏర్గట్ల మండలంలోని ఏర్గట్ల గ్రామానికి చెందిన లబ్ధిదారులు జుంగల గంగు, హుస్సేన్ బి.లకు స్మార్ట్ రేషన్ కార్డులను వేదికపై అందజేశారు. స్మార్ట్ రేషన్ కార్డులను అందుకున్న లబ్ధిదారులు జుంగల గంగు, హుస్సేన్ బి.లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల తహసీల్దార్ జె. మల్లయ్య, డిప్యూటీ తహసీల్దార్ రమేష్, మండల ఆర్ఐ రవి, జీపీఓలు వెంకటేష్, సంపత్, భూమన్న, మధుతో పాటు మండలంలోని వివిధ గ్రామాల రేషన్ దుకాణాల డీలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జె. మల్లయ్య మాట్లాడుతూ, మండలంలోని మిగతా అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం నిర్ణయించిన తేదీల ప్రకారం వారి వారి గ్రామాల్లో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను త్వరలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
