. . . యథేచ్చగా అక్రమ దందా
. . . అక్రమార్కులకు వరమైన మొరం తవ్వకాలు
. . . చోద్యం చూస్తున్న అధికారులు
రుద్రూర్, బతుకమ్మ :
పచ్చనదంతో కళకళలాడాల్సిన గుట్టలు కొందరు అక్రమార్కుల తాకిడికి కనుమరుగవుతున్నాయి. రుద్రూర్ మండల కేంద్రంలోని రాయకూర్ గ్రామ శివారులోని గుట్ట ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా మొరం తవ్వకాలు చేపడుతూ అటవీ సంపదను కొల్లగొడుతున్నారు. జేసీబీల సహాయంతో మొరం త్రవ్వకాలు చేపడుతూ ట్రాక్టర్లలలో అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ దందాను అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రభుత్వ భూముల నుంచి కాని అటవీ ప్రాంతాల నుంచి కాని, చెరువుల నుంచి మొరం తీయాలంటే తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాలి కాని ఇక్కడ అవేమి లేవు. అభివృద్ధి పనుల పేరిట అక్రమంగా మొరం తవ్వుతూ గుట్టల ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిసినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

